Monday, March 26, 2012

వేదాంగ జ్యోతిషం

వేదకాలపు ఋషులు ఖగోళాన్ని నిశితంగా పరిశీలించేవారు.   జ్యోతిషం గురించి ఋగ్వేదంలో 36 ద్విపదలలో ప్రస్తావించబడింది. ఈ క్రింది ఋగ్వేద మంత్రాన్ని పరిశీలించండి

    ద్వాదశారం నహితాజ్జరాయ
    వర్వతి చక్రం పరిద్యామృతస్య
    ఆ పుత్ర అగ్నే మిథునా సో
    అత్ర సప్త  శతాని వింశతిశ్చ తస్యః  (24-1-164-11)

సూర్యుడి చక్రానికి పన్నెండు ఆకులు. (ఈ పన్నెండూ నెలలన్న మాట) ఓ అగ్నీ, ఈ చక్రం పైన యేడువందల ఇరవైమంది అధిరోహించి ఉన్నారు ( మూడువందల అరవై పవళ్ళు,  మూడువందల అరవై రాత్రులు అన్నమాట)

అథర్వవేదం క్రీ.పూ. 3000 ప్రాంతంలో ఆవిష్కృతమైనది. ఈ క్రింది అథర్వవేద మంత్రాల్ని చూడండి.

    అయం గౌః ప్రశ్మిర్ క్రమీదస దన్మాతరం పురః
    పితరం చ ప్రయత్నస్వన్    (4-VI-30-1)
    త్రిసద్ ధామా వి రాజతి వాక్ పతంగో ఆశిశ్రియత్
     ప్రతి వస్తోరహద్యభిః    (4-VI-30-3)

ఈ మంత్రం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని స్పష్టంగా చెబుతోంది.   ఈ మంత్రం రాత్రింబవళ్ళను సూర్యుడు ఒక్కొక్కటి ముప్పది భాగాలుగా చేస్తున్నాడని కూడా చెబుతోంది.  దీనిని బట్టి ఒక్కక్క ఆలాంటి విభాగమూ 24 నిముషాల ప్రమాణం కలిగి ఉందని తేలుతోంది.  ఇదే భారతీయమైన అత్యంత పురాతన సమయ విభాగం.

ఇలా రోజును 60 భాగాలుగా చేయటం  బాబిలోనియన్ల పధ్దతి అనీ,  కొందరు బాబిలోనియన్ల వద్దనుండి భారతీయ ఖగోళజ్ఞులు  ఈ ఘడియ అనే మాటను గ్రహించారనీ, క్రీ.పూ 400 సంవత్సరాల కాలంలోని లగధుడు యీ ఘడియ అనే మాటను తన జ్యోతిషవేదాంగగ్రంధంలో వాడాడనీ భావించారు.    కాని అథర్వవేదం క్రీ.పూ 3000 కాలంలో రచించబడితే,  బాబిలోనియన్ల  నాగరికత క్రీ.పూ 2వ శతాబ్దికాలం నాటిదే.

లగధుడి రచన అయిన వేదాంగజ్యోతిషం క్రీ.పూ 1500 కాలంనాటిది.   లగధుడు  'నాడి' అని యీ విభాగానికి నామకరణం చేయటం ఈ క్రింది శ్లోకంలో చూడవచ్చును

    పలాని పంచాశదపం ధృతాని
    తదాఢకం ద్రోణమతః ప్రమేయం
    త్రిభిర్విహీనం కుడవైస్తు కార్య
    తన్నాడికాఖ్యస్తు భవేత ప్రమాణం

లగధుడి వేదాంగ జ్యోతిషంలో యెక్కడా  ప్రస్తుతకాలందాకా వాడుకలో ఉండిన  యీ 'ఘటిక లేదా ఘడియ' అనే 24నిముషాల కాలప్రమాణం ప్రసక్తి కనిపించదు.   ఆయితే  'ఘటిక లేదా ఘడియ' మాటను వరాహమిహిరాచార్యులు తన పంచసిధ్ధాంతిక ధ్వారా ప్రచారంలోనికి తెచ్చినట్లు కనిపిస్తున్నది.  పంచసిధ్ధాంతికను వరాహమిహిరుడు క్రీ,శ. 505లో విరచించాడు.

లగధుడి వేదాంగ జ్యోతిషంలో రెండు విభాగాలున్నాయి. ఒకటి  ఋగ్వేదజ్యోతిషం లేదా ఋక్-జ్యోతిషం, రెండవది యజుర్వేదజ్యోతిషం లేదా యజుర్జ్యోతిషం.  ఋగ్వేదజ్యోతిషంలో 36శ్లొకాలు, యజుర్జ్యోతిషంలో 44శ్లోకాలూ ఉన్నాయి.   అయితే యీ రెండు విభాగాల మధ్య చాలా శ్లోకాలు ఉమ్మడిగా దర్శనం  యిస్తాయి. అధర్వవేదజ్యోతిషం అని 162శ్లోకాలు గల మరొకటి ఉన్నది కాని అది వేదాంగజ్యోతిషంలో  భాగం కాదని తెలుస్తోంది.

" వేదాంగ జ్యోతిషం " గ్రంధంలో " యుగం " వివరణ ఇచ్చారు. ఇందులో యుగంలో ఐదేళ్ళున్నాయి. మాఘ మాస శుక్ల ప్రతిపద నాడు సూర్య చంద్రుల రేఖాంశ స్థానం ధనిష్ఠ (బీటా డెల్ఫినీ) నక్షత్రంలో ఉన్నప్పుడు ఆరంభమయ్యింది. ఇక్కడ విశేషంగా గమనించాల్సినది యేంటంటే ఆనాటికే మాస, తిథి, వార, ఆయన, నక్షత్ర, సంవత్సర, (రేఖాంశ స్థానం), కాల స్వరూపాలు వ్యవహారంలో ఉన్నాయి. అధిక, క్షయమాసాలగురించిన వివరణలను యీ గ్రంధం యిచ్చింది. క్షయ తిథులు, నక్షత్ర అహోరాత్రుల గణక సాధనాపద్ధతులు వ్యవహారంలో ఉండేవి. యుగంలో ఉన్న యేళ్ళు - 5,   సావన (సివిల్) దినములు (5 X 366) - 1830 దినములు, సౌర మాసాలు (5 X 12) - 60, చాంద్ర మాసాలు - 67, తిథులు (చాంద్రమాన దినములు) (62 X 30 దినములు) - 1860, క్షయ తిథులు (1860 - 1830) - 30, నక్షత్ర దినములు (67 X 27 దినములు) - 1809

ఋగ్వేదజ్యోతిషంలోని  యీ క్రింది శ్లోకాన్ని గమనించండి.
    ధర్మవృధ్దిరపాం ప్రస్థా  క్షపా హ్రాస ఉదాగస్తౌ
    దక్షిణేతౌ విపర్యాసః షణ్ముహూర్త్యానేన తు
సూర్యుడి ఉత్తరక్రాంతి దినాల్లో అహఃప్రమాణం పెరుగుతుంది, రాత్రిప్రమాణం తగ్గుతుంది. అదే సూర్యుడి దక్షిణక్రాంతి దినాల్లో  రాత్రిప్రమాణం పెరుగుతుంది,  అహఃప్రమాణం తగ్గుతుంది.  ఈ హెచ్చుతగ్గులయ్యే  దివారాత్రప్రమాణవ్యత్యాసం అత్యధికంగా 6 ముహూర్తాలుగా ఉంటుంది అని పై శ్లోకం యొక్క అర్థం.    కాశ్మీరంలో తప్ప భారతదేశంలో యేప్రాంతంలోనూ యింత హెచ్చు  వ్యత్యాసం రాదు.  దీని ఆధారంగా లగధుడు కాశ్మీరబ్రాహ్మణుడని ఊహిస్తున్నారు. 

No comments:

Post a Comment

వ్యాఖ్యలకు అనుమతి అవసరం!