Tuesday, March 20, 2012

రాహు కేతువులు ఎవరు? వాళ్ళు గ్రహాలెట్లాగయ్యారు? మంచివాళ్ళేనా?

సరదాకి ముందుగా మనం ఒక పురాణగాధ  చెప్పుకుందాం ఈ రాహు కేతువుల గురించి.

అమృతం కోసం పాలసముద్రాన్ని దేవతలూ రాక్షసులూ మధించారు.  బోలెడు తిప్పలు పడ్డాక, బోలెడు సంఘటనలు చెడ్డవీ మంచివీ కూడా జరిగాక, ఆ అమృతం కాస్తా లభించింది.  దాన్ని రాక్షసులు యెగరేసుకొని పోతుంటే దేవతలు లబోదిబో మని గోల పెట్టి శ్రీమహావిష్ణువుని  ఆశ్రయించారు.  ఆయన జగన్మోహిని అయిన అమ్మాయి రూపంలో రంగంలోకి దిగి రాక్షసులను మోహపరవశులను చేసి దేవదానవులకు తాను సమానంగా అమృతాన్ని పంచిపెడతానని నమ్మబలికి అంతా దేవతలకే పంచుతాడు.  మోహినీ మోహంలో పడిన రాక్షసులు దానిని కనిపెట్టలేక భంగపడతారు.  వాళ్ళలో రాహువు అనే రాక్షసుడు మాత్రం మోహిని మోసం గ్రహించి దేవతల మధ్యలో దూరి అమృతం సేవించబోతాడు.  సూర్యచంద్రులు వాడిని పసిగట్టి మోహినీ రూపంలో ఉన్న విష్ణువుకు తెలియ జేస్తారు.  విష్ణువు తన చక్రంతో  రాహువు తల నరుకుతాడు.  కాని అప్పటికే అమృతం తాగిన రాహువు చావడు. రెండు ముక్కలవుతాడు అంతే.  ఆ తల పేరు  యధాప్రకారం రాహువు. తోక భాగం పేరు కేతువు.  సూర్యచంద్రులు తన గుట్టు బయట పెట్టినందుకు కక్షతో వాళ్ళని వీలయినప్పుడల్లా మింగాలని చూస్తూ ఉంటాడు.  అలా రాహుకేతువులకు చిక్కిన సూర్యచంద్రులకే గ్రహణం పట్టిందని అంటాము. ఈ కధ యెంత ప్రచారంలోనికి వచ్చిందంటే ఇప్పటికీ దీన్ని గుడ్డిగా నమ్మే వాళ్ళున్నారు.

మనదేశానికి గర్వకారణమైన ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్టు అనే ఆయన క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందిన వాడు.
ఆయన భూమినీడ చంద్రునిపైన పడటం వలన చంద్రగ్రహణం వస్తున్నదనీ రాహుకేతువులని నిజంగా యెవరూ లేరనీ చెప్పితే ప్రజలు పట్టించుకోలేదు.

కధ పక్కన బెట్టి శాస్త్రీయంగా రాహుకేతు విచారం చేద్దాం.   భూమి సూర్యుని చుట్టూ తిరిగే  కక్ష్య(మార్గం) ఒక దీర్ఘ వృత్తాకారంగా ఉంటుంది.  అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్యకూడా దీర్ఘ వృత్తాకారంగానే ఉంటుంది.  ఈ దీర్ఘ వృత్తాకారపు కక్ష్యలు రెండు  వేరు వేరు.  ఈ రెండు పరస్పరం ఖందించుకొనే బిందువులు రెండు.   ఈ కక్ష్యలు యెలా యెవరూ వేసిన కాంక్రీటు రోడ్లుకావో కళ్ళకు కనిపించే వస్తువులు కావో ,   అలాగే వీటి ఖండనబిందువులు కూడా.    ఈ బిందువులనే పాశ్చాత్యులు డ్రాగన్  యొక్క తల, తోకలని పిలుస్తారు.  మనం రాహు కేతువులంటాం.  ఇవేమీ స్థిరబిందువులు కావు. అపసవ్యంగా మెల్లగా కదులుతూ 18.6సంవత్సరాలకో భ్రమణం పూర్తి చేస్తాయి. అన్నట్లు ఈ రెండు పరస్పరం 180 డిగ్రీల్లో ఉంటాయి. కారణం స్పష్టం.   రెండు వృత్తాలు పరస్పరం ఖండించుకునే బిందువులు అలా  180 డిగ్రీల్లోనే కదా ఉండేదీ.

అయితే యీ రాహుకేతువులకు నిజంగానే గ్రహణాలతో సంబంధం ఉంది అని సులువుగా గ్రహించ వచ్చును.  ఎందుకంటే  వాటిలో ఒకటి భూమి సూర్యుడి చుట్టూ తిరిగే దారీ, మరొకటి చంద్రుడు భూమి చుట్టూ తిరిగే దారీ గనుక.  అమావాస్యనాడు చంద్రుడు ఈ బిందువులలో ఒకదానికి 17° 25' లేదా యింకా సమీపంలో ఉంటే, సూర్యగ్రహణం వస్తుంది. పౌర్ణమినాడు  చంద్రుడు ఈ బిందువులలో ఒకదానికి 11° 38' లేదా యింకా సమీపంలో ఉంటే,  చంద్రగ్రహణం వస్తుంది.   ఒక సంవత్సరంలో మూడు నుండి యేడు వరకు గ్రహణాలు (సూర్యచంద్రగ్రహణాలు మొత్తం) యేర్పడతాయి. ఈ సూర్యచంద్రగ్రహణాల గురించి విడిగా వేరే వ్యాసంలో చర్చిద్దాం.

పాశ్చాత్యులు జాతకచక్రాలలో ఊర్థ్వబిందువు (డ్రాగన్  యొక్క తల లేదా రాహువు)ను మాత్రం సూచిస్తారు. మనవాళ్ళు రాహుకేవువులనిద్ధరినీ సూచిస్తారు.  ఈ రాహుకేతువులకు రాశిచక్రంలో స్వతంత్ర గ్రహ ప్రతిపత్తి లేదు. స్వంత యిళ్ళు లేవు.  శనివత్ రాహుః కుజవత్ కేతుః అని చెబుతారు. అయితే జాతకపధ్ధతిలో  రాహువుకు 18సంవత్సరాలూ, కేతువుకు 7 సంవత్సరాలూ దశలు కేటాయించారు.   జాతక చక్రంలో రాహుకేతువులిద్దరికీ మధ్యన మిగిలిన అన్ని గ్రహాలూ ఒకవైపునే మోహరిస్తే దానిని కాలసర్పయోగం అని అంటారు. దీనిలో భిన్నమైన విషయాలూ ఉన్నాయి.

రాహుకేతువులిద్దరినీ జాతకపద్ధతిలో దుష్టగ్రహాలుగానే పరిగణిస్తారు.

6 comments:

  1. thanks for the info on this ancient science.
    all the best for your efforts.

    ReplyDelete
  2. మనోహర్ గారూ, కృతజ్ఞతలండి.

    ReplyDelete
  3. థాంక్స్ అండీ.
    మంచి విషయాలు పంచుకుంటున్నారు.
    మీ పోస్ట్ కోసం, ఆత్రుత గా ఎదురు చూస్తున్నాము
    -sudha

    ReplyDelete
  4. svaami
    mee mail adress paMpagalaraa ?
    durgeswara@gmail.com

    ReplyDelete
  5. నమస్కారం శ్యామలీయం గారూ.

    చాలా చక్కని శైలిలో, సులభ పద్దతిలో వ్రాస్తున్నారు. ధన్యవాదములు.

    ReplyDelete
  6. చాలా క్లియర్ పిక్చర్ ఇచ్చారు రాహు కేతువుల గురించి.
    ఈ చ్ఛాయా గ్రహాల ప్రభావం భూమి మీద ఏవిధంగా వుంటుందో తెలియచేస్తారా, వీలైతే!

    ReplyDelete

వ్యాఖ్యలకు అనుమతి అవసరం!