Monday, April 2, 2012

శ్రీనివాస రామానుజంకు జ్యోతిష్యంపై గాఢ విశ్వాసం ఉండేదట.

గణితలోక సూర్యుడు, భారత దేశపు కీర్తిని ఆచంద్రతారార్కం చేసిన మేధావి శ్రీనివాస అయ్యంగార్ రామానుజం పవిత్రస్మృతికి అంకితమిస్తూ ఈ 2012వ సంవత్సరాన్ని భారతప్రభుత్వం  జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది.  అంతేకాదు, ప్రతి సంవత్సరమూ డిసెంబరు 22వ తారీఖును  జాతీయ గణితశాస్త్రదినం(National Mathematics Day)గా ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ప్రతి సంవత్సరమూ డిసెంబరు 22వ తారీఖును  రాష్ట్ర IT దినంగా ఇప్పటికే ప్రకటించింది.

రామానుజం మేధస్సుగురించీ ఆయనకు రాబోయే మహత్కీర్తిగురించీ  జోస్యురాలైన ఆయన grand mother ముందే చెప్పినట్లు తెలుస్తున్నది. 

రామానుజంకు తన తల్లిగారి ప్రోత్సాహంతో జ్యోతిషం మీదా హస్తసాముద్రికం మీదా ఆసక్తి కలిగినట్లు తెలుస్తోంది.   ఆయన మరొక ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు న్యూటన్ లాగే ఈ జ్యోతిషవిద్య పట్ల మంచి ఆరాధనాభావంతో ఉండే వాదని తెలుస్తున్నది.   ఆయన తన లండన్ ప్రయాణానికి మంచి ముహూర్తం చూసుకొని మరీ వెళ్ళాడట.

రామానుజం స్వయంగా జాతకాలు చెప్పేవారట. ఒకసారి రామానుజం ఒక జబ్బుగా ఉన్న వ్యక్తి జాతకం చూసి ఆతని ఇంటికి పోయి, అతడిని యిల్లువదలి బయటకు రమ్మన్నాడట.  ఆ వ్యక్తికి మరణం ఒకానొక  సమయంలో అదే ఇంట్లో సూచించబడి ఉందని రామానుజం గ్రహించి ఇట్లా చేసాడట.  ఆ తరువాత ఆ వ్యక్తి మృత్యుగండం  నుండి తప్పించుకున్నాడని తెలుస్తున్నది.   ఇదీ,  ఇలాంటిదో మరొక సంఘటనా "The man who knew infinity" అనే పుస్తకంలో వర్ణించబడ్డాయి.

రామానుజం ఆరోగ్యం చెడినప్పుడు ఆయన తల్లి కోమలం (కోమలత్తమ్మాళ్) గారు ఒక జ్యోతిష్కుడి దగ్గరకు ఆయన జాతకం తీసుకొని వెళ్ళి ,  ఆ జాతకం ఎవరిదో చెప్పకుండా చూపించారట. ఆ జ్యోతిష్కుడు, ఈ జాతకుడు అల్పాయుష్కుడైన మహాకీర్తిశాలిగాని,  దీర్ఘాయుష్కుడైన అతిసామాన్యుడు కాని అయి ఉండాలనీ అని చెప్పి, పిదప అది రామానుజం జాతకం అని తెలిసి చాలా ఖిన్నుడయ్యాడట.

మనవాళ్ళు చాలామంది తమకు తెలిసిన అరకొర పరిజ్ఞానంతోనే,   కొందరైతే - అసలామాత్రం  పరిజ్ఞానం  కూడా లేకుండానే ,  జ్యోతిషం ఒక మూఢనమ్మకమనీ అశాస్త్రీయమనీ గొంతులు చించుకుంటున్నారు.  సరే,  జ్యోతిషం ఒక శాస్త్రమని ప్రగాఢవిశ్వాసం కలవాళ్ళలో కూడా చాలా మందికి గల పరిజ్ఞానం అసమగ్రమే ననుకోండి  - అందు చేత వాళ్ళలో కూడా చాలామంది ప్రతిపక్షం మీద అసహనంతో వాదిస్తున్నారు.   అదంతా అనవసరం.  శ్రీ C.V. రామన్ గారు గ్రహణస్నానాలు చేసేవారు  అని విన్నాను.  ఒకరి విశ్వాసం మరొకరికి నచ్చనంత మాత్రాన దూషణాపర్వానికి పూనుకోకూడదు కదా.  రామానుజానికి జ్యోతిషం పట్ల ప్రగాఢ విశ్వాసం అనురక్తి ఉన్నంతమాత్రాన ఆయన మేధావి కాకపోడు.  అది ఆయన వ్యక్తిగత విశ్వాసానికి, యిష్టాయిష్టాలకు సంబంధించిన విషయం.  మేధావులమనుకునే వారు,  హేతువాదులమని చెప్పుకునే వారూ,  రామానుజం ఒక మూర్ఖుడని  హేళన చేయబోతే, అది వారికే మంచిది కాదు.  ఆకాశంపైన ఉమ్మి వేస్తే యేమి జరుగుతుందో తెలిసిందే కదా! 

1 comment:

వ్యాఖ్యలకు అనుమతి అవసరం!